తెలంగాణ ఐసెట్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వచ్చేశాయ్‌.. సీట్లు రాని వారికి మరో ఛాన్స్‌

www.mannamweb.com


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు వెలువడ్డాయి.

ఇప్పటికే ఐసెట్‌ తొలి, మలి విడత కౌన్సెలింగ్‌ పూర్తికాగా.. మిగిలిపోయిన సీట్లను స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్‌ 15, 16 తేదీల్లో స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్‌ ఎ.శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆయా కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్‌ ఎ.శ్రీదేవసేన తెలిపారు. ఇప్పటి వరకూ సీట్లు పొందని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

తెలంగాణ ఐసెట్‌ 2024 వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అక్టోబర్‌ 22 నుంచి ఏఈ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి మెరిట్‌ జాబితా విడుదలైన సంగతి తెలిసింది. మెరిట్‌ జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థులకు అక్టోబరు 22 నుంచి నవంబరు 5 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. వీరందరికీ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ పరిశీలన ఉంటుందన్నారు. అభ్యర్ధులందరూ సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్‌ కాపీలను కూడా తమతోపాటు తీసుకురావాలని సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీలో 174 మంది విద్యార్ధులకు ఎంబీబీఎస్‌ సీట్లు

తెలంగాణ రాష్ట్రంలో నీట్‌ ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఎస్సీ గురుకుల సొసైటీకి చెందిన 174 మంది విద్యార్థులు సీట్లు పొందినట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. సాయివంశీ అనే విద్యార్థి 438వ ర్యాంకుతో గాంధీ మెడికల్‌ కాలేజీలో, హేమంత్‌ 1791 ర్యాంకు, శృతి 3378 ర్యాంకులతో ఉస్మానియాలో సీట్లు పొందినట్లు వెల్లడించారు.