అందుకే వైసీపీని వీడా..జగన్‌పై ఆర్‌ కృష్ణయ్య సంచలన కామెంట్స్

www.mannamweb.com


బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్‌ కృష్ణయ్య ఇటీవల తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవితో పాటు, వైసీపీకి సైతం రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్‌ కృష్ణయ్యను పార్టీ తరుఫున రాజ్యసభ సభ్యుడుగా నియమించారు జగన్. అయితే ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో పలువురు నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి, బీదా మస్తాన్ వంటి రాజ్యసభ సభ్యులు పదవులతో పాటు, పార్టీకి సైతం గుడ్ బై చెప్పారు. ఈక్రమంలోనే ఆర్‌ కృష్ణయ్య కూడా రాజ్యసభ పదవితో పాటు, వైసీపీకి రాజీనామా చేశారు.

ఆర్‌ కృష్ణయ్య రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆయనపై మండిపడ్డాయి. కృష్ణయ్యపై జగన్ ఎంతో నమ్మకం ఉంచి ఎంపీ పదవి ఇస్తే దానిని వదులుకుని వైసీపీకి వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆర్‌ కృష్ణయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువలు లేని వారికి పదవులు కట్టబెడితే ఇలానే ఉంటుందని ఆర్‌ కృష్ణయ్యపై వైసీపీ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆర్‌ కృష్ణయ్య స్పందించారు. తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆర్‌ కృష్ణయ్య తెలిపారు.తనకు పదవులు కన్నా బీసీ సంక్షేమమే ముఖ్యమని తేల్చేశారాయన.

రాజ్యసభ సభ్యుడుగా కొనసాగడం వల్ల బీసీ సంక్షేమానికి పాటు పడలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. నేను రాజ్యసభలో ఉండటం వల్ల బీసీలకు ఉపయోగం ఉండటం లేదని, దీని కారణంగానే వైసీపీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. తాను రాజ్యసభలో ఉండడం వల్ల నష్టమే ఎక్కువ జరిగిందని, , బీసీ ఉద్యమమే ఆగిపోయిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి ఎందుకు అనిపించి రాజీనామా చేశానని చెప్పారు. ఈ సమయంలో ఆర్‌ కృష్ణయ్య జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద కానీ, ఆయన పార్టీ మీద కానీ నాకు ఎటువంటి ద్వేషం లేదని,జగన్ మీద అభిమానం ఈ రోజుకీ అలానే ఉందని ఆర్‌ కృష్ణయ్య చెప్పుకొచ్చారు.

జగన్ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఆర్. కృష్ణయ్య చెప్పుకొచ్చారు.బీసీల కోసం జగన్ ఎంతో చేశారని అన్నారు. ఆయన బీసీల కోసం ఎన్నో పధకాలను కూడా ప్రవేశపెట్టారని కూడా కొనియాడారు. బీసీలకు అధికారం కట్టబెట్టిన ఘనత కచ్చితంగా జగన్‌కే దక్కుతుందని ఆయన వ్యాఖ్యనించారు. జగన్‌కు ఎప్పుడు నష్టం చేకూర్చాలని అనుకోలేదని, నా రాజీనామా వల్ల ఆ పదవి టీడీపీకి వెళ్తుందనే లెక్కలు తాను వేసుకోలేదని ఆర్. కృష్ణయ్య తెలిపారు. అయితే ఆయన త్వరలోనే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు.