ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది.
సూపర్ సిక్స్లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. అలానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన నిధులు కూడా జమ కానున్నాయి.
రాష్ట్రంలోని 46 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బును ప్రభుత్వం జమ చేయనుంది. ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బును ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్, ఏపీ ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ కలిపి.. రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు అందనున్నాయి. పీఎం కిసాన్ కింద 6 వేలు, అన్నదాత సుఖీభవ కింద 14 వేలు రానున్నాయి. మొత్తంగా రైతులకు రెండు విడతల్లో 7 వేల చొప్పున.. ఓ విడతలో 6 వేలు బ్యాంక్ ఖాతాలలో పడనున్నాయి.
మొదటి విడతగా రూ.7000 రైతుల ఖాతాలో ఆగస్ట్ 2న జమ కానున్నాయి. అర్హులైన రైతుల కుటుంబాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,325 కోట్ల నిధులు విడుదల చేసింది. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.831 కోట్లతో కలిపి మొదటి విడతలో 7000 రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తంగా తొలి విడతలో రూ.3,156 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
































