Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుదారుల కోసం e-KYC ప్రక్రియ గడువును మళ్లీ పొడిగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు దీనిని పొడిగించినట్లు ప్రకటించింది.


అసలు అయితే మార్చి 31వ తేదీ వరకు ఈ గడువు విధించిన సంగతి తెలిసిందే.

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద లబ్ధిదారులకు సబ్సిడీ పంపిణీలో పారదర్శకతను నిర్ధారించడం.. అలాగే అర్హత లేని వ్యక్తుల దుర్వినియోగాన్ని నివారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పొడిగింపు వల్ల ఇప్పటి వరకు e-KYC పూర్తి చేయని రేషన్ కార్డుదారులు ఏప్రిల్ 30 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చునని సూచించింది.

అధికారులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఎందుకంటే మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉండక పోవచ్నని వివరిస్తున్నారు. e-KYC పూర్తి చేయని వారి రేషన్ కార్డులు రద్దు కావచ్చునని స్పష్టం చేస్తుంది. దీని వల్ల ఉచిత రేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ప్రచారం నిర్వహిస్తోంది. e-KYC ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి రేషన్ షాపులు, ఆధార్ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లను సంప్రదించవచ్చునని కేంద్రం స్పష్టమైన వివరణ ఇచ్చింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అందుకు గడువు సైతం విధించింది. ఈ గడువు పూర్తయిన వెంటనే.. ప్రభుత్వ సిబ్బంది విచారణ చేపట్టి.. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజురు చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు ఒక్క రేషన్ కార్డు సైతం మంజూరు చేయలేదంటూ ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డు మంజూరు చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విధితమే.