ఆ ఉద్యోగులకు రూ.20 లక్షలు.. ‘పరిపూర్ణ బీమా’తో క్యాష్‌లెస్ చికిత్స

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటికే చాలా రకాల కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా కానుక తీసుకొచ్చింది. ఉద్యోగుల కోసం ఓ కొత్త బీమా పథకాన్ని తీసుకొచ్చింది.


దీని ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కోసం ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’ అనే సరికొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల నుంచి ఉద్యోగులను రక్షించడమే ఈ కొత్త స్కీమ్ ప్రధాన ఉద్దేశం.

గతంలో ఉద్యోగులు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి వీలు ఉండేది. అయితే, ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ చికిత్స పొందవచ్చు. దీనివల్ల ఎమర్జెన్సీలో ఖరీదైన వైద్య సేవలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి చందాదారు రూ. 10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు భారీ ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుంది. అత్యధునిక టెక్నాలజీతో సర్జరీలు, వైద్య పరీక్షలకు ఈ మొత్తం తోడ్పడుతుందని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే అమలులో ఉండే సీజీహెచ్ఎస్ సేవలు కొనసాగుతూనే అదనంగా రూ.20 లక్షల బీమా రక్షణ వస్తుందని తెలిపింది.

ఒకే ప్లాన్‌తో ఆరుగురికి..

సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీలు సంపాదించే వారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా మాత్రం ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. గరిష్ఠంగా ఆరుగురు కుటుంబ సభ్యులను ఇందులో చేర్చవచ్చు. తద్వారా ఒకే పాలసీ ద్వారా కుటుంబం మొత్తానికి బీమా రక్షణ లభించినట్లవుతుంది. ఇంటి పెద్ద, పిల్లలు అందరికీ ఆరోగ్య భద్రత లభిస్తుంది.

పాలసీదారులపై భారం పడకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం 70:30 రేషియోలో కో పేమెంట్ పద్ధతి అమలు చేస్తోంది. అంటే 70 శాతం బీమా కంపెనీ భరిస్తే, మిగిలిన 30 శాతం పాలసీదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా పథకం ఆసుపత్రిలో చేరే సమయం నుంచి డిశ్చార్జైన తర్వాత వరకు అయ్యే ఖర్చుల మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఆసుపత్రి జనరల్ వార్డుకు ఇన్సూరెన్స్ మొత్తంలో ఒక శాతం, ఐసీయూకు 2 శాతం వరకు రోజువారీ రెంట్‌గా నిర్ణయించారు.

హాస్పిటల్‌లో చేరేందుకు నెల రోజుల ముందు చేసిన వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు సైతం ఈ పాలసీ పరిధిలోకే వస్తాయి. వైద్యం పూర్తై డిశ్చార్జైన రెండు నెలల వరకు అయ్యే వైద్య ఖర్చులు సైతం ఈ స్కీమ్ కవర్ చేస్తుంది. పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పండగ కానుకగా చెప్పువచ్చు. ఇది ఉద్యోగితోపాటు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా అందిస్తుంది. ఖరీదైన వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.