ఏపీలో వీరికి ఆదివారం, రంజాన్ సెలవులు లేవు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. పాత బకాయిలపై వడ్డీలో 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక్కడ కండిషన్స్ అప్లై, ఈ రాయితీ 2025 మార్చి 31 వరకు చెల్లించే బకాయిలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులతో పాటుగా భారీగా బకాయిలు పేరుకుపోవడంతో వసూళ్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నెల 30, 31 తేదీల్లో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను వసూలు కౌంటర్లు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.


ఈ నెల 30, 31 తేదీల్లో పన్ను వసూలు కౌంటర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. ఆది, సోమవారాల్లో కూడా కౌంటర్లు తెరిచి ఉంచాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయాలని పుర, నగరపాలక సంస్థల కమిషనర్లను పురపాలక శాఖ సంచాలకులు పి సంపత్‌కుమార్‌ అధికారుల్ని ఆదేశించారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్తిపన్ను బకాయిలు ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించింది. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదే‌లోని మున్సిపల్ శాఖ ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని పురపాలక శాఖ ప్రకటించింది. భవనాలు, ఖాళీ స్థలాలపై పాత బకాయిలపై వడ్డీని 50% వరకు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను మార్చి 31లోపు ఒకేసారి చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామని ప్రభుత్వం జీవో నం.46లో తెలిపింది. మార్చి 31లోపు వడ్డీతో సహా బకాయిలు ఒకేసారి చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నులో సర్దుబాటు చేస్తారు.
ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని.. పట్టణాలు, నగరాల అభివృద్ధికి పన్నులు చెల్లించి తమకు సహకరించాలని అధికారులు సూచించారు.

అయితే పట్టణాల్లో ఆస్తి, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో చెల్లించకపోతే రూ.100కు రూ.2 వడ్డీ పడుతుంది. జనవరి నుంచి జూన్ నెలాఖరులోపు.. జులై నుంచిడిసెంబరు నెలాఖరులోపు పన్ను చెల్లించాలి. గతంలో ప్రభుత్వం ఇంటి అద్దె వార్షిక విధానం నుంచి మూలధన విలువపై ఆస్తి పన్ను మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకే ఆస్తి పన్ను బాగా పెరిగిపోయింది. దీంతో పన్ను చెల్లించేవారు ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే ఈ నెల 30, 31న రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో మార్చి 30, 31ని రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రెండు రోజులు ఆఫీసులు ఉ.11 నుంచి సా.5.30 గంటల వరకు పని చేస్తాయి. ఈ నెల 30న ఆదివారం, ఈ నెల 31న రంజాన్ కావడంతో సెలవులు.. కానీ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రం ఓపెన్ చేస్తారు.