ఏపీలో కొత్తగా మూడు రైల్వే లైన్‌లు.. ఈ రూట్‌లో 100 కిలోమీటర్లకుపైగా, చెన్నైకు త్వరగా వెళ్లొచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. వీటికి తోడు కేంద్రం హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ ఏర్పాటు లక్ష్యంగా అడుగులు వేస్తోంది.


బుల్లెట్‌ రైళ్లను నడిపే దిశగా కసరత్తు జరుగుతుండగా.. అందుకే రైల్వే లైన్ల సంఖ్యను పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులలో భాగంగా ఏపీకి 26 కొత్త ప్రాజెక్టులు రాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు కేటాయించారు. ఇప్పటికే చెన్నై నుంచి రేణిగుంట వరకు లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద నిర్మాణాలు దాదాపు పూర్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌లపై సరకు రవాణా రైళ్లు, వేగంగా వెళ్లే హైస్పీడ్ రైళ్లు రెండూ ఒకేసారి వెళ్లడం సాధ్యం కాదని రైల్వే అధికారులు గుర్తించారు. దీనివల్ల రవాణా ఆలస్యం అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి, కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త లైన్ల నిర్మాణం కోసం, ప్రాజెక్టుల వివరాలతో కూడిన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు రైల్వే శాఖకు సూచించారు. ఈ డీపీఆర్‌లను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు పెట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా రైల్వే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.

కొత్తగా మూడు రైల్వే లైన్లు ప్రతిపాదన

చెన్నై- తిరుపతి మార్గంలో అరక్కోణం- రేణిగుంట మధ్య 43 కిలోమీటర్లు పొడవున రైల్వే లైన్లు ప్రతిపాదించారు. కొత్తగా 3 లేదా 4 రైల్వే లైన్లు పెంచాలని భావిస్తున్నారు. ఎందుకంటే చెన్నై నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయితే రేణిగుంట నుంచి చెన్నై మార్గంలో అరక్కోణం వరకు సింగిల్‌ ట్రాక్‌ మాత్రమే ఉంది. ఈ ట్రాక్‌లోనే యూనిట్, సరకు రవాణా రైళ్లు కూడా నడుస్తున్నాయి. అందుకే కొత్తగా ఈ మూడు రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

చెన్నై- గూడూరు మార్గంలో గుమ్మడిపూండి- సూళ్లూరుపేట మధ్య 18.40 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు ప్రతిపాదించారు. అలాగే సూళ్లూరుపేట- గూడూరు మధ్య 55 కిలోమీటర్లు 3 లేదా 4 రైల్వే లైన్లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఈ మూడు రైల్వే లైన్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే అధికారులకు సమర్పించనున్నారు. రైల్వే అధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ మూడు రైల్వే లైన్ల పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్లు పూర్తయితే చెన్నైకు త్వరగా వెళ్లొచ్చని భావిస్తున్నారు. అలాగే చెన్నై వైపు వెళ్లేందుకు రైళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉంది అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.