తిరుమల జనవరి 2026 టికెట్ల వివరాలివీ: కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేయండి

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 61,521 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,101 మంది తలనీలాలు సమర్పించారు.


తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

  • 2026లో జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల తేదీలు, ఇతర వివరాలను టీటీడీ విడుదల చేసింది.
  • శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 19వ తేదీన ఉదయం 10 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. రెండు రోజుల పాటు అంటే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
  • శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్ల కోటా ఆన్‌లైన్‌ బుకింగ్ ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. అలాగే- వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణలో పాల్గొనదలిచిన వారి కోసం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.
  • సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా టికెట్లు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
  • జనవరిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు.
  • తిరుమల, తిరుపతిల్లో వసతి గదులను బుక్ చేసుకోవదలిచిన వారు అదే రోజున అంటే 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
  • తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు.
  • తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.