డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబరు 3నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.
డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబరు 3నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. ముందే కౌన్సెలింగ్ నిర్వహించి, ప్లేస్మెంట్స్ ఇచ్చి 4 నుంచి 13 వరకు శిక్షణ ఉంటుందని మళ్లీ చర్చ సాగింది. దీనిపై కమిషనర్ విజయరామరాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఈనెల 3 నుంచి 10వతేదీ వరకు శిక్షణ ఉంటుందనీ, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈలెక్కన కొత్త టీచర్లకు వారంపాటే శిక్షణ ఉంటుందని స్పష్టమైంది. శిక్షణకు హాజరయ్యే కొత్త టీచర్లు డ్రస్కోడ్ తప్పనిసరిగా పాటించి, పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 11, 12 తేదీల్లో పాఠశాలలో ప్లేస్మెంట్లు కేటాయించడానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
13వ తేదీన కొత్త టీచర్లు కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కానున్నారు. శిక్షణకు హాజరైన టీచర్లకే కౌన్సెలింగ్లో ప్లేస్మెంట్లు ఇస్తామని కమిషనర్ మెలిక పెట్టినట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గైర్హాజరైన వారికి రాష్ట్రస్థాయిలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ హాజరైన తర్వాతే ప్లేస్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త టీచర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సమగ్రశిక్ష అధికారుల తర్జనభర్జన
కొత్త టీచర్లకు శిక్షణ తరగతుల ఏర్పాట్లలో సమగ్రశిక్ష శాఖ అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శిక్షణ నిర్వహణ బాధ్యతలను సమగ్రశిక్షకు అప్పగించారు. జిల్లాకు చెందిన 755 మంది టీచర్లతోపాటు కర్నూలు నుంచి 800 మంది శిక్షణకు హాజరవుతున్నారు. అందుకు రెసిడెన్షియల్ స్థాయిలో వసతులు ఉన్న కళాశాలలు, శిక్షణ కేంద్రాలను డీఈఓ ప్రసాద్బాబు, ఏపీసీ శైలజ పరిశీలిస్తున్నారు. దీనిపై బుధవారానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఏపీసీ తెలిపారు.
































