అమెరికా జాతీయ భద్రత పేరుతో ఇప్పటికే గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు భారత్కు అత్యంత సమీపంలో ఉన్న డీయెగో గార్సియా దీవిపై కూడా కన్నేశారు.
ఈక్రమంలోనే హిందూ మహాసముద్రంలో.. కీలక ప్రాంతంలో ఉన్న ఈ దీవిని మారిషస్కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది బ్రిటన్ చేసిన “మూర్ఖమైన పని” అంటూ ఆయన మండిపడ్డారు.
ఏమిటీ డీయెగో గార్సియా వివాదం?
చాగో దీవుల సముదాయంలోని అతిపెద్ద దీవి అయిన డీయెగో గార్సియా.. సుమారు 30 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది మాల్దీవులకు సమీపంలో, భారత్కు దిగువన ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ యూకే, అమెరికాల ఉమ్మడి సైనిక, నౌకా స్థావరం ఉంది. అయితే సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ దీవిని మారిషస్కు తిరిగి ఇచ్చేందుకు 2025 మేలో బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2124 వరకు అంటే మరో 99 ఏళ్ల పాటు ఈ దీవులను యూకేకు మారిషస్ లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది.
యూకే తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు. “మన తెలివైన నాటో మిత్రదేశం యూకే.. అత్యంత కీలకమైన సైనిక స్థావరం ఉన్న డీయెగో గార్సియాను మారిషస్కు అప్పగిస్తోంది. ఇది మన అసమర్థతకు నిదర్శనమని చైనా, రష్యాలు గుర్తిస్తాయి. ఎంతో వ్యూహాత్మకమైన ఈ దీవిని తిరిగి ఇవ్వడం ద్వారా అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది” అని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్లో ఆందోళన వ్యక్తం చేశారు.
1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్కు అండగా నిలిచేందుకు అమెరికా ఈ దీవిని ఒక ప్రధాన వైమానిక స్థావరంగా మార్చింది. ప్రస్తుతం ఇక్కడ భారీ బాంబర్లు, ఎఫ్-సిరీస్ యుద్ధ విమానాలతో పాటు సుమారు 5 వేల మంది సైనిక బలగాలు ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి ఈ దీవి అమెరికాకు ఒక బలమైన కోటలాంటిది. అందుకే దీనిపై నియంత్రణ కోల్పోవడం ట్రంప్కు ఇష్టం లేదు.
కానీ డీయెగో గార్సియాను యూకే తిరిగి మారిషస్కు అప్పగించే విషయంలో భారత్ ఎప్పటి నుంచో మారిషస్కు మద్దతుగా నిలిచింది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, సముద్ర భద్రత కోసం మారిషస్కు భారత్ ఆర్థికంగా కూడా భారీ సాయం చేస్తోంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. త్వరలోనే దీన్ని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందేమోననే భావన వ్యక్తమవుతోంది.



































