wedding ceremony : పెళ్లి సందడి కాస్తా శోకసంద్రం.. గుర్రం చేసిన పనికి ఊరంతా కన్నీరు..

పెళ్లి సందడి నెలకొన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలముకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో( Kanpur ) జరిగిన ఈ హృదయ విదారక ఘటన( Tragic Incident ) అందరినీ కంటతడి పెట్టించింది.


గుర్రం( Horse ) తన్నిన దెబ్బకు కృష్ణ అనే ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ పెళ్లింట శోకసంద్రం నిండిపోయింది. ఆడుతూ పాడుతూ సందడిగా ఉండాల్సిన పెళ్లి ఊరేగింపు ఒక్కసారిగా విషాదఛాయల్లోకి మారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే, హనుమంత్ విహార్‌లోని ఠాకూర్ చౌక్ ప్రాంతంలో విక్కీ వాజ్‌పేయి కుమారుడు శరద్ పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఊరేగింపులో భాగంగా ఓ ఆడ గుర్రం డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తోంది. అప్పుడే కృష్ణ( Krishna ) అనే బాలుడు ఆడుకుంటూ గుర్రం వెనుకవైపు వెళ్లాడు. క్షణం ఆలస్యం చేయకుండా గుర్రం వెనక్కి తన కాలుతో బలంగా తన్నింది. ఆ దెబ్బకు కృష్ణ తల పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.

కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు వెంటనే కృష్ణను దగ్గరలోని రీజెన్సీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, తలకు బలంగా గాయం కావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పక్కనే ఉన్న ఇంటిలోని సీసీటీవీ కెమెరాలో ఈ విషాద ఘటన రికార్డయింది. సంతోషంగా డ్యాన్సులు, పాటలతో సాగుతున్న ఊరేగింపులో గుర్రం వెనుకనుంచి వెళ్తున్న కృష్ణ ఒక్క క్షణంలో కిందపడిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. బాలుడిని కాపాడేందుకు అందరూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

12 ఏళ్ల తర్వాత పుట్టిన కృష్ణ మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రి సురేష్ చంద్ర గుప్తా యోగేంద్ర విహార్‌లో ఈ-రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లి ఊరేగింపు కోసం గుర్రాన్ని వారి ఇంటి ముందు ఉంచారని, వరుడు గుర్రంపై కూర్చొని ఉండగా, గుర్రం డ్యాన్స్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు. చిన్నారి కృష్ణ మరణించడం పట్ల చాలామంది సానుభూతి చూపిస్తున్నారు.