రిటైర్మెంటుతో.. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌..?

ఇప్పుడు దేశవ్యాప్తంగా రిటైర్మెంటు తీసుకున్న ఉద్యోగస్తులు ఆలోచిస్తున్న అంశం.. తమ చేతికొచ్చిన లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ మొత్తంలో మినహాయింపు రూ.3,00,000 పోగా పన్నుకి గురైన మిగతా భాగం గురించే.


దీనిపై సమాచారాన్ని ఈ వారం తెలుసుకుందాం.

లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కొన్ని రూల్స్‌కి లోబడి రూ.3,00,000 వరకు మినహాయింపు ఉండేది. 24-03-2023 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మొత్తాన్ని రూ.25,00,000కు పెంచారు. ఈ డేటు తర్వాత వచ్చిన వాటికి ఇది వర్తిస్తుంది. ఈలోగా ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 01-01-2016 నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగస్తులకు జీతాలు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ భారీగా పెరిగాయి. 01-01-2016 తర్వాత రిటైర్‌ అయిన ఉద్యోగస్తులు తమ ఆదాయ పన్ను రిటర్నులలో రూ.3,00,000 వరకు మినహాయింపు పొంది, మిగతా మొత్తాల మీద 30 శాతం పన్ను, విద్యా సుంకం 4 శాతం.. వెరసి 31.2 శాతం పన్ను చెల్లించి సరిపెట్టుకున్నారు. ఇది సంతోషాన్ని కలిగించినప్పటికీ కొంత అలజడి మొదలైంది.

కొంత మంది ఉద్యోగస్తులు నోటిఫికేషన్‌ అంశాన్ని లేవదీసి, ఆ మేరకు అదనంగా కట్టిన ట్యాక్స్‌ రిఫండు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు యధావిధిగా అన్నింటినీ తోసిపుచ్చారు. విషయం ట్రిబ్యునల్‌ వరకు వెళ్లింది. అక్కడ ఉపశమనం లభించింది. వడ్డీతో సహా రిఫండ్‌ వచ్చింది. ఈ విషయం ఉద్యోగ సంఘాల ద్వారా ఊరు, వాడా చేరింది. ఒకే ప్రశ్న మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది.. మీరూ రిఫండు కోసం క్లెయిమ్‌ చేయొచ్చు. క్లెయిమ్‌ చేయడం తప్పు కాదు. ఎటువంటి రిస్కు కాదు. ఖర్చేమీ కాదు. ఫైల్‌ చేయండి.

ఎలా చేయాలి..

కాగితాలన్నీ సమకూర్చుకోండి. మీ గత చరిత్ర ఒక పద్ధతిలో పెట్టండి. ఏ సంవత్సరంలో దాఖలు చేశారు, అక్నాలెడ్జ్‌మెంటు, రిటర్ను కాపీ, అసెస్‌మెంట్‌ ఆర్డరు, ట్యాక్స్‌ చెల్లించిన చలాన్లు, వాటికి సంబంధించిన అన్ని కాగితాలు.

కాలదోషం పట్టిన కేసుల్లో రిటర్ను వేయకూడదు. అలా వేయాలంటే డిపార్టుమెంటు నోటీసులు ఇవ్వాలి. ఈ విషయంలో అలాంటివి జరగవు. ఆటోమేటిక్‌గా వాళ్లు రిఫండు ఇవ్వరు. మీరు రివైజ్‌ రిటర్ను వేయాలి.

రివైజ్‌ రిటర్ను వేయాలంటే మీకు అనుమతి కావాలి. ఆ అనుమతి కేంద్ర పన్నుల బోర్డు ఇవ్వాలి. బోర్డు అంటే.. మీరు ఢిల్లీ పరుగెత్తనక్కర్లేదు. మీకు సంబంధించిన ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ వారికి దరఖాస్తు చేసుకోవాలి.

ఇలా దరఖాస్తు చేయడాన్ని కండోనేషన్‌ అప్లికేషన్‌ వేయడం అంటారు. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్‌లో వీరి కార్యాలయం ఉంది. ప్రత్యక్షంగా ఫైల్‌ చేయొచ్చు లేదా ఐటీ పోర్టల్‌లోనైనా చేయొచ్చు. లాగిన్‌ తర్వాత సర్వీసెస్‌ బోర్డుకి వెళ్లాక, కండోనేషన్‌ రిక్వెస్ట్‌ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. క్రియేట్‌ రిక్వెస్ట్‌ అని ఉంటుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. నింపండి.

ఏ వివరాలు ఇవ్వాలంటే.. మీ వివరాలు, కేసు వివరాలు, గతంలో రిటర్న్‌ వేసిన వివరాలు, నిజాలన్నీ పొందుపరుస్తూ, నా తప్పేమీ లేదు, ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అని రివైజ్‌ రిటర్ను వేయడానికి అనుమతి వేడుకోండి.

సాధారణంగా అనుమతి ఇస్తారు. రోజూ వెబ్‌సైట్‌ వాచ్‌ చేయండి. అనుమతి రాగానే రివైజ్‌ రిటర్ను వేయండి.

అన్ని కాగితాలు/వివరాలు ఇచ్చి రిటర్ను వేస్తే రిఫండు వచ్చే అవకాశం ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.