100 శాతం వరకు విత్‌డ్రా..! పీఎఫ్‌ నిబంధనల సరళీకరణ

పీఎఫ్‌ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనల సరళీకరణకు ‘ఉద్యోగ భవిష్యనిధి సంస్థ’ (EPFO) ముందుకొచ్చింది. ఇప్పుడు చందాదారులు.. ఉద్యోగి, యజమాని వాటా సహా పీఎఫ్‌ నిధిలో అర్హమైన బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్‌వో ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌’ ఈమేరకు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఏడు కోట్లకు పైగా చందాదారులకు ప్రయోజనం కలగనుంది.


  • పీఎఫ్‌ పాక్షిక విత్‌డ్రాకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను సీబీటీ ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది. మూడు రకాలుగా.. ‘ముఖ్యమైన అవసరాలు’ (అనారోగ్యం, విద్య, వివాహం), ‘గృహ అవసరాలు’, ‘ప్రత్యేక పరిస్థితులు’గా వర్గీకరించింది.
  • విత్‌డ్రా లిమిట్స్‌ కూడా పెంచింది. చదువుల కోసం 10 సార్లు, వివాహం విషయంలో 5 సార్లు వరకు పాక్షిక విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికీ మూడు సార్లవరకే అనుమతి ఉంది.
  • అన్ని పాక్షిక ఉపసంహరణలకు చందాదారుల కనీస సర్వీసును 12 నెలలకు తగ్గించింది.
  • గతంలో ‘ప్రత్యేక పరిస్థితులు’ ఆప్షన్‌ కింద పాక్షిక పీఎఫ్‌ ఉపసంహరణకు నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది. ఇప్పుడు ఎటువంటి కారణాలు చెప్పకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పీఎఫ్‌ ఖాతాలో జమచేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా ఉంచేలా నిబంధన రూపొందించారు. తద్వారా ఈపీఎఫ్‌వో అందించే అధిక వడ్డీ రేటు (ప్రస్తుతం 8.25%), పెద్దమొత్తంలో రిటైర్మెంట్‌ ప్రయోజనాలు పొందొచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.