బెంగళూరు ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్

బెంగళూరులో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఏ రోడ్డు చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

ఇందులో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలనే ప్రతిపాదన ప్రధానంగా ఉంది.


భారతదేశ ‘సిలికాన్ వ్యాలీ’గా పిలువబడే బెంగళూరులో ఐటీ కంపెనీల సంఖ్య పెరగడంతో జనాభా, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గకపోవడంతో పోలీసులు, మెట్రోపాలిటన్ అధికారులు కలిసి ఈ కొత్త నిబంధనలను రూపొందించారు.

ప్రణాళికలోని ముఖ్యాంశాలు:

  • 1,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తమ వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలి.
  • ఐటీ ఉద్యోగులకు వారానికి కనీసం ఒకరోజు ఇంటి నుండి పనిచేసే (WFH) అవకాశం కల్పించాలి.
  • వారంలో ఒక రోజును ‘నో కార్ డే’ (No Car Day) గా పాటించి, ఆ రోజున బస్సు సేవలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి.

నగరంలో వాహనాల వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, ట్రాఫిక్ రద్దీని 40 శాతం వరకు తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఫిబ్రవరి మొదటి వారంలో ఐటీ మరియు బయోటెక్నాలజీ సంస్థలతో చర్చలు జరపనున్నారు. కంపెనీలు అంగీకరిస్తే ఈ ప్లాన్ అమలులోకి వస్తుంది.

బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో రోజుకు సుమారు 2,500 నుండి 3,000 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, ఇది తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.