YS Jagana: రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది: వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSRCP) చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తొలిసారి టీడీపీపై (TDP) సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు.


వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని, అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ఆరోపించారు. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్ అభ్యర్థించారు. టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని, టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.