వైఎస్ జగన్ ప్రెస్‌ మీట్.. కాసేపటికే లిస్ట్ వదిలిన చంద్రబాబు

www.mannamweb.com


హామీ అమలు.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఇదే. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తోందని.. హామీల అమలు ఏమైందంటూ వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగ యువతకు, రైతులకు ఇలా అందరికీ హామీలు ఇచ్చారని.. ఇప్పుడం ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే తాము అధికారంలో ఉండి ఉంటే.. ఇప్పటికే రైతుభరోసా, చేయూత, అమ్మ ఒడి ఇలా.. అన్ని పథకాలు ఇప్పటికే అమలు చేసి ఉండేవారమని చెప్తున్నారు. టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని.. సూపర్ సిక్స్ కాదు అవుట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇదే విషయమై శుక్రవారం కూడా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు.

అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలకు సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. ఇదే సమయంలో వైఎస్ జగన్ పదే పదే చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ కూటమి సర్కారు చేసిన పనులు ఇవీ అంటూ చంద్రబాబు లిస్ట్ విడుదల చేశారు. వైసీపీ విమర్శలకు దీటుగా బదులివ్వాలని.. ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు మొదలుపెట్టామని.. త్వరలోనే మరిన్ని అమలు చేస్తామని చెప్పాలన్నారు.

“ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం. గీత కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చాం. అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంచాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంచాం. ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచాం. వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తున్నాం. చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం. కేంద్రం ఇవ్వకపోతే రీయింబర్స్ చేస్తాం. చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం. పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లైన్‌లో పెట్టాం” అని చంద్రబాబు చెప్పారు.

అమరావతే రాజధానిగా ఉంటుందన్న చంద్రబాబు.. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందన్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని.. ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తామని చెప్పారు రైతులకు డ్రిప్‌లు అందిస్తున్నామనీ.. పాడి రైతులకు 90 శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయ్యిందన్న చంద్రబాబు.. రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించిన సంగతిని గుర్తుచేశారు. శాంతిభద్రతల విషయంలోనూ రాజీ పడకుండా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తున్నామని.. ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తామని చెప్పారు. ఇక దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని.. ఇవన్నీ ధైర్యంగా చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.