సొంత బాబాయ్ ను హత్య చేసినప్పుడు దిల్లీలో ధర్నా చేయలేదే? – జగన్ కు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న

www.mannamweb.com


YS Sharmila : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచారన్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై దిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. బాబాయ్ ను చంపిన వారితోనే కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వినుకొండ ఘటన వ్యక్తిగత కారణాలతో జరిగిందని, రాజకీయ హత్య కాదన్నారు. వర్షాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రజలు ఆదుకోవాలన్నారు.

ఏపీలో వర్షాలు బీభత్సా్న్ని సృష్టించాయని వైఎస్ షర్మిల అన్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడిన రైతన్నలను వర్షాలు మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేకపోవడం… గేట్లు ఊడిపోయిన సందర్భాలు చూశామన్నారు. ఇటీవల వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేసి వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందని, దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. ఏపీలో ఒక్కొక్క రైతుకు సగటున 2.5 లక్షల అప్పు ఉందని, ఏపీలో రైతులకు రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఏపీ ఎంపీలు అందరూ బీజేపీకే మద్దతు పలుకున్నారని, కానీ పదేళ్లుగా బీజేపీ ఏపీకి ఒక్క మేలు కూడా చేయలేదన్నారు. కేంద్ర బడ్జె్ట్ లో ఏపీకి ఎప్పుడూ మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ ఏడాదైనా ఏమైనా మార్పుంటుందేమో చూడాలన్నారు. రాజధానికి కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు అవుతుందని, రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ విషయంలో ఇన్నాళ్లు వైసీపీ , బీజేపీ నాటకాలు ఆడాయన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ స్పెషల్ ప్యాకేజీలు, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా ఈ హామీలను కేంద్రం ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని వైఎస్ షర్మిల అన్నారు.

“వినుకొండలో జరిగిన హత్య పొలిటికల్ నేపథ్యం కానే కాదు. వ్యక్తగత కారణాలతో జరిగిందంటున్నారు. వైసీపీ, టీడీపీ మద్దతు మీడియా చెప్పిన విషయాలు కాకుండా… న్యూట్రల్ మీడియాతో స్థానికంగా విచారణ చేస్తే వినుకొండ ఘటన వ్యక్తిగత మర్డర్ అని తెలిసింది. మొన్నటి వరకూ హత్య చేసినవాళ్లు, హత్యకు గురైన వాళ్లు వైసీపీతోనే ఉన్నారు. అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకు దీన్ని పొలిటికల్ మర్డర్ అనే ముద్ర వేసి దిల్లీ వెళ్లి ధర్నా చేస్తారంట. జగన్ గతంలో హత్యా రాజకీయాలు చేశారు. అధికారంలో ఏం పట్టించుకోని జగన్ ఇప్పుడు కార్యకర్తలను చంపేస్తున్నారని దిల్లీలో ధర్నా చేస్తారా? అసెంబ్లీలో ఉండి ప్రశ్నించకుండా దిల్లీలో ఏం చేస్తారు. ” – వైఎస్ షర్మిల