రాజమండ్రి సెంట్రల్ జైల్లో రౌడీషీటర్, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వటంతో మీడియా కంటపడకుండా ఈరోజు(బుధవారం) ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని జైలు సూపరింటెండెంట్కు బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు.
అనిల్పై ఏపీ హై కోర్టు ఆగ్రహం..
కాగా..జగన్ హయాంలో చెలరేగిపోయిన రాజ్యాంగేతర శక్తి, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో హైకోర్టుకే టోకరా వేసి మధ్యంతర బెయిలు పొడిగించుకున్న సంగతి తెలిసిందే. బెయిలు గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిపోయింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడు ఆ సమయంలోపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. కానీ, మళ్లీ బెయిలు పొడిగించాలంటూ మంగళవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. అదేం కుదరదని… సాయంత్రంలోపు అతను జైల్లో లొంగిపోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా… బోరుగడ్డ తన అజ్ఞాతం వీడలేదు.
ముగిసిన గ్రేస్ పీరియడ్..
‘హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ గడువు ముగిసేలోపు బోరుగడ్డ అనిల్ జైలుకు వచ్చి లొంగిపోలేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు, పై అధికారులకు తెలియచేశాం’ అని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల్లోపు చెన్నై నుంచి విమానంలో వచ్చి అయినా జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ అరగంట కలుపుకొని సాయంత్రం 5.30 గంటలు దాటినా బోరుగడ్డ జైలుకు రాలేదు. అయితే బుధవారం రాజమండ్రిలో జైలు సూపరింటెండెంట్ ఎదుట అనిల్ లొంగిపోయాడు.