మెడికల్ షాపు నుంచి టాబ్లెట్ కొని ఇంటికి తీసుకెళ్లిన 32 ఏళ్ల మహిళ, తర్వాత మృతి

మాజంలో మెడికల్ షాపులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. స్థానిక ప్రజలకు ఎప్పుడు ఏ వ్యాధి లేదా నొప్పి వచ్చినా కూడా మెడిసిన్స్ తీసుకుని ఉపశమనం పొందుతారు.


కానీ ఇటీవల మాత్రం ఓ మహిళ విషయంలో ఘోరం జరిగింది. అసలేం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ ఝాబువా జిల్లాలో ఓ 32 ఏళ్ల మహిళ ఓ మెడికల్ షాపుకు పంటి నొప్పికి నివారణ మందు కొనడానికి వెళ్లింది. ఆ క్రమంలో ఆమెకు పొరపాటున మెడికల్ షాపు వారు సల్ఫాస్ టాబ్లెట్ ఇచ్చారు. ఇది ఒక పురుగుల మందు. సాధారణంగా గోధుమలను సంరక్షించడానికి ఉపయోగిస్తారు.

రంగంలోకి పోలీసులు..

ఆ క్రమంలో మహిళ ఇంటికెళ్లి ఆ టాబ్లెట్ గురించి తెలియకుండా వేసుకుంది. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చేరినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు షాపు యజమాని లొకేంద్ర బాబెల్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 (మర్డర్ కాకపోయిన హత్య) కింద కేసు నమోదు చేశారు. షాప్‌ను సీల్ చేసి, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌ను విచారణలో భాగస్వామ్యం చేశారు. దీంతోపాటు సేల్స్‌పర్సన్‌ను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సల్ఫాస్ టాబ్లెట్ ఎందుకు వాడతారు..

సల్ఫాస్ టాబ్లెట్ అనేది అల్యూమినియం ఫాస్ఫైడ్ (Aluminium Phosphide) అనే రసాయన పదార్థం కలిగిన పురుగుల మందు. దీనిని గోధుమాలు, ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను పురుగుల నుంచి రక్షించడానికి ఉపయోగిస్తారు. ఈ టాబ్లెట్‌ను తీసుకోవడం వల్ల మానవ శరీరంలో ఫాస్ఫైన్ గ్యాస్ విడుదల అవుతుంది. ఇది శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసి ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

ఇలాంటి విషాద ఘటనలు మళ్లీ జరగకుండా నివారించడానికి, మెడికల్ షాపులు మందులు విక్రయించే ముందు కస్టమర్లకు సరైన మందులు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక మంది సాధారణ ప్రజలు మెడికల్ షాపుల వారిని నమ్మి మందుల కోసం వస్తారు. అలాంటి క్రమంలో తప్పుడు మందులు ఇస్తే వారి కుటుంబాలకు ద్రోహం చేసినవారవుతారు. ఈ ఘటన నేపథ్యంలో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలతోపాటు అనేక మంది కోరుతున్నారు. దీంతోపాటు మందుల విక్రయంపై కూడా నిబంధనలు కఠినతరం చేయాలని అంటున్నారు.