Panipuri: పానీపూరీ తింటే క్యాన్సర్ ఖాయం.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం!

www.mannamweb.com


ఏం తినాలన్నా భయమేస్తోంది.. ఏది తిన్నా క్యాన్సర్ అంటున్నారు.. ఏ పదార్థం గురించి తనిఖీ చేసినా క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటున్నారు. ఈ కెమికల్స్‌, రసాయానాల సంగతి అటు ఉంచితే హోటల్‌, రెస్టారెంట్‌ నుంచి ఏం కొనాలన్నా చెమటలు పడుతున్నాయి.

ఎందుకంటే చికెన్ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే అందులో బొద్దింకలను కలిపి కీటకాల బిర్యానీ అందిస్తున్నారు. నల్లీ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే బల్లి బిర్యానీ ఇస్తున్నారు. సరే ఈ బిర్యానీలన్ని కాస్త ఖర్చుతో కూడుకున్నవి.. డబ్బులు ఉంటే కొనుకొవచ్చు లేదంటే లేదు.. అయితే పేద, మద్యతరగతి నుంచి ధనికులు వరకు ఎక్కువగా కుమ్మేసే పానీపూరీలను కూడా తినలేని దుస్థితి దాపరించడం దుర్మార్గం. సామాన్యులకు అత్యంత ఇష్టమైన పానీపూరీలోనూ క్యాన్సర్ కారకాలు ఉండడం బాధాకరం!

కర్ణాటకలోని పానీపూరీ షాప్‌లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పానీపూరీ శాంపిల్స్‌ను పరీక్షించారు. ఈ పరీక్షల్లో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. కర్ణాటకలో అమ్ముడవుతున్న పానీపూరీలు ఆరోగ్యానికి హానికరమైనవని ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. సేకరించిన 260 శాంపిల్స్‌లో 41 శాంపిల్స్‌లో ఆర్టిఫిషియల్‌ కలర్స్‌, క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఏజెంట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 18 శాంపిల్స్ అయితే అసలు మనుషులు తినడానికి పనికిరావని తేలింది.

పానీపూరీ సాస్, స్వీట్ చిల్లీ పౌడర్‌లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. చాలా శాంపిళ్లలో సన్ సెట్ యెల్లో , బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్లు గుర్తించారు. ఇక 19 శాంపిళ్లలో సింథటిక్ కలర్స్ ఉన్నాయి. దీంతో కర్ణాటక సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. పానీపూరీ తయారీలో ఆర్టిఫిషియల్‌ కలర్స్‌తో తయారు చేసే సాస్‌లు, స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది.

నిజానికి కర్ణాటకలో 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫుడ్‌ సేఫ్టిపై బాగా ఫోకస్ చేసింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న గోబీ మంచూరియన్‌ను ముందుగా బ్యాన్ చేసింది. ఆ తర్వాత కబాబ్‌లు, చికెన్, చేపలు, శాఖాహార వంటకాలతో సహా వివిధ ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులను ఉపయోగించడాన్ని నిషేధించింది.

తెలంగాణ ప్రభుత్వం సైతం ఇటీవల హోటల్స్, రెస్టారెంట్లపై వరుసగా దాడులు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఫుడ్ కలర్స్ వాడేవారిపై చర్యలు తీసుకుంటుంది. పరిశుభ్రత పాటించని వారిపై సైతం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సైతం ఇలాంటి పదార్థాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ సాగుతోంది.