Shanthi: విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం

Shanthi: విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం


అమరావతి: మదన్‌మోహన్‌ మానిపాటి అనే వ్యక్తితో 2016లోనే తాను విడిపోయానని, తర్వాత 2020లో సుభాష్‌ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్‌తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరేవారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్‌మోహన్‌ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.

మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్‌మోహన్‌ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గిరిజన మహిళను కాబట్టే తనను వేధిస్తున్నారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనపై జారీచేసిన అభియోగపత్రంలో 8 ఆరోపణలతో తనకు సంబంధమే లేదని చెప్పారు. 2013లో మదన్‌మోహన్‌తో తనకు వివాహమైందని.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని చెప్పారు. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నానని వివరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.