AP DGP: మదనపల్లె ఘటన యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌: డీజీపీ

www.mannamweb.com


AP DGP: మదనపల్లె ఘటన యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌: డీజీపీ

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని, ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘గత రాత్రి సుమారు 11.30 గంటలకు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్‌ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్‌ ఇన్సిడెంట్‌ జరిగింది. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలింది. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ వాళ్లు కూడా చెప్పారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు ప్రారంభించాం. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశాం. కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై మంగళవారం లేదా బుధవారం నిర్ణయం తీసుకుంటాం. యాక్సిడెంట్‌ కాదు.. కుట్రో కాదో విచారణలో తేలుస్తాం’’ అని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్న ఆయన.. పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

రన్నింగ్‌ ఫైల్స్‌ దగ్ధమయ్యాయి: కలెక్టర్‌
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రన్నింగ్‌ ఫైల్స్‌ దగ్ధమైనట్లు కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయన్నారు. ఈ 25 అంశాల్లో చుక్కల భూములు, నిషేధిత భూములు ఉన్నట్లు తెలిపారు. కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, షార్ట్‌ సర్క్యూట్‌ కానప్పుడు ఘటన ఎలా జరిగిందనేది తేలాల్సి ఉందని చెప్పారు.