AP News ఉపాధ్యాయుల సర్దుబాటు! కసరత్తు చేసిన పాఠశాల విద్యాశాఖ

www.mannamweb.com


అమరావతి: ప్రభుత్వ బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు పని సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కొత్తగా నిర్వహించే మెగా డీఎస్సీలో ఎంపికైనవారు వచ్చేవరకు తాత్కాలికంగా ఈ సర్దుబాటు చేయనుంది. పాఠశాలల్లో ఎక్కువగా ఆంగ్ల భాష, గణితం సబ్జెక్టుల కొరత తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అదనంగా ఉన్న ఉపాధ్యాయులు, అవసరమైన పోస్టుల గణాంకాలను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8,773మంది సబ్జెక్టు టీచర్లు అదనంగా ఉండగా.. 17,190మంది అవసరం కానున్నట్లు తేల్చింది. కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు అదనంగా ఉండగా.. కొన్ని బడులకు అవసరం ఏర్పడింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కలిపి 20,469మంది ఎస్జీటీలు మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఇందులో 5,248మంది ఇతర బడులకు అవసరం ఉన్నట్లు పేర్కొంది. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కొరతను తీర్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఆంగ్లం, గణితం కొరత..
ఆంగ్ల భాష టీచర్లు 660మంది అదనంగా ఉండగా.. 4,270మంది అవసరం ఉంది. అదనంగా ఉన్నవారిని సర్దుబాటు చేసినా కొరత తీవ్రంగా ఉండనుంది. గణిత సబ్జెక్టుకు 905మంది అదనంగా ఉండగా.. 3,985మంది అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉన్నత పాఠశాలల్లో గణితం ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట పైతరగతులకు ప్రాధాన్యం ఇచ్చి, కిందిస్థాయి తరగతుల బోధనను నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలున్నాయి. దిగువ తరగతులకు కొన్నిచోట్ల గణితం ఉపాధ్యాయుడితో కాకుండా ఇతర సబ్జెక్టు టీచర్లతో చెప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఆంగ్ల భాష సబ్జెక్టు విషయంలోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. తెలుగు భాషకు సంబంధించి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉండగా.. హిందీకి కొంత కొరత ఉంది. భౌతికశాస్త్రం సబ్జెక్టుకు అదనంగా ఉన్న వారిని సర్దుబాటు చేస్తే దాదాపుగా సరిపోతున్నారు. జీవశాస్త్రం టీచర్లు 1,127మంది అదనంగా ఉండగా.. 2,282మంది అవసరం కానున్నట్లు గుర్తించారు.

ఉమ్మడి తూర్పుగోదావరిలో అత్యధికంగా మిగులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఎస్జీటీ టీచర్లు మిగులుగా ఉన్నారు. ఈ జిల్లాలో 2,488మంది అదనంగా ఉండగా.. ఇతర బడులకు 362మంది మాత్రమే అవసరం కానున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఆ తర్వాత గుంటూరులో 2,292 అదనంగా ఉండగా.. 258ని ఇక్కడ సర్దుబాటు చేయాల్సి ఉంది. అనంతపురంలో 1,963మంది టీచర్లు ఉండగా.. అవసరం 249గా ఉంది. అత్యధికంగా కర్నూలు జిల్లాకు 1,398మంది ఎస్జీటీలు అవసరం కానున్నట్లు గుర్తించింది. ఇక్కడ ఇతర బడుల్లో మిగులుగా ఉన్న వారిని సర్దుబాటు చేయనుంది. ఎస్జీటీల అర్హతలను అనుసరించి పదోన్నతులు కల్పించడంపైనా కసరత్తు చేస్తోంది. దీంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత కొంతవరకు తీరుతుంది.