సీఎం చంద్రబాబు ఎంట్రీతో మెరిసిన మంగళగిరి.. తరలివచ్చిన మహిళలు, దివ్యాంగులు

www.mannamweb.com


రూల్స్‌ పాస్‌ చేయడమే కాదు బాసూ.. పాటించడమూ తెలుసంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రజా ప్రతినిధులందరూ ప్రజల్లో ఉండాలని ప్రతి ఒక్కరికి సీరియస్‌గా చెప్పిన బాబు.. తానూ ఆ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. అందిరిలా నేను, అందరితో నేను అన్నట్లు.. మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లడంతో.. మంగళగిరి ఒక్కసారిగా మెరిసింది. పార్టీ నేతలకు పండగొచ్చినట్లైంది. సామాన్యులకు కొండంత అండ దొరికినట్లైంది.

ఏపీలో బౌన్స్‌ బ్యాక్‌ అయిన చంద్రబాబు.. జెడ్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ట్రెండ్‌ ఫాలో అవడమూ తెలుసు.. సెట్‌ చేయడమూ తెలుసంటూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని చెప్పిన బాబు.. తానూ ఆ విషయాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. సీఎం అయ్యిండీ, ఫుల్‌ బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ.. ప్రజల కోసం ఒకరోజు అంటూ ముందుకు కదిలారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజలతో చంద్రబాబు మమేకమయ్యారు.

సీఎం చంద్రబాబు మంగళగిరి ఎంటర్ అవ్వగానే ఘనస్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పారు. ఇక మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్న ఆయన… దాదాపు మూడు గంటలు నిల్చుని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతిఒక్కరితోనూ మాట్లాడారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి సాధకబాధకాలను సీఎం పంచుకున్నారు.

వైసీపీ నేతలపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. భూ సమస్యలంటూ కొందరు, అక్రమ కేసులంటూ మరికొందరు చంద్రబాబును కలిసి వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఆరోగ్య సమస్యలంటూ మరికొందరు సీఎంను కలిశారు. ఆర్ధికంగా చితికిపోయిన తమకు వైద్యం అందించాల్సిందిగా వేడుకున్నారు. అయితే ప్రభుత్వం అండగా ఉంటుందని… ప్రతి పైసా పార్టీ భరిస్తుందని చంద్రబాబు వారికి చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

విరాళాలు కూడా పెద్ద ఎత్తున అందాయి. చంద్రబాబును కలిసి పలువురు దాతలు చెక్కులు, బంగారం, నగదు రూపంలో… రాజధాని, అన్నాక్యాంటీన్ల కోసం విరాళాలు అందజేశారు. కంకిపాడుకు చెందిన ఓ రైతు రాజధాని నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు అందజేస్తే… విజయవాడకు చెందిన మాణిక్యమ్మ అనే ఓ వృద్దురాలు తన చేతికున్న గాజును తీసి అన్నా క్యాంటీన్ల కోసం విరాళంగా ఇచ్చేసింది. వీరితో పాటు చాలా మంది రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ తమకు తోచినంత సాయం అందజేశారు.

ఇటు కార్యకర్తలు, పార్టీ నేతల్లోనూ జోష్‌ నింపారు చంద్రబాబు. ప్రతిఒక్క కార్యకర్తను ఆప్యాయంగా పలకరించారు. ఎవరైతే ప్రజల వెంట ఉండారో వారికే పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. చేసిన మంచి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న ఆయన… ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకెళ్లాలని సూచించారు. మొత్తంగా…పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజుకో మంత్రి లేదా సీనియర్ నేత అందుబాటులో ఉండాలని రూల్‌ పెట్టిన చంద్రబాబు.. అందులో భాగంగానే తనవంతుగా వెళ్లి ప్రజలను కలిశారు. విరాళాలతో పాటు పెద్ద ఎత్తును ఫిర్యాదులను స్వీకరించారు.