ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయి పదేళ్లు గడుస్తున్నా… ఇప్పటికీ కొన్ని సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆస్తుల విభజన, భవనాలు ఖాళీ చేయటం, ఉద్యోగాల బదిలీ లాంటి అంశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

అయితే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులను.. తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది.

తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీకి కేటాయించగా… వారిలో కొందరు తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. మిగిలిన వారు మాత్రం అక్కడే పని చేస్తూ ఉండిపోయారు. అయితే.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జులై 6న హైదరాబాద్‌లో భేటీ అయిన సందర్భంలో.. తమ సమస్యను కూడా చర్చిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పలుమార్లు ఉద్యోగులు చేసిన విన్నపాలు, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో.. మొత్తానికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఏపీ సర్కార్ ఏపీలో పని చేస్తున్న తెలంగాణా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీంతో.. సదరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.