ఏపీలో దిశ పోలీస్ స్టేషన్‌ల పేర్లు మార్చిన ప్రభుత్వం.. కొత్తగా ఏ పేరు పెట్టారంటే

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. 2014-2019 టీడీపీ హయాంలో మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉండేవి.. జగన్ సర్కార్ వాటిని దిశ పోలీస్ స్టేషన్‌లుగా పేరు మార్చింది. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే దిశ చట్టానికి కేంద్రం నుంచి క్లియరన్స్ మాత్రం రాలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. హోంమంత్రి వంగలపూడి అనిత దిశ పోలీస్ స్టేషన్‌ల పేర్ల మార్పుపై రెండు నెలల క్రితమే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తామని చెప్పారు.. ఇప్పుడు పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

2019లో హైదరాబాద్ శివారులో ఒక మెడికో (దిశ)పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత జగన్ సర్కార్ దిశ పేరుతో చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఆడవాళ్ల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించారు.. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో పథకాలతో పాటూ మిగిలిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని పథకాలకు పేర్లు మార్చగా.. రివర్స్ టెండరింగ్, ఎస్ఈబీలను రద్దు చేసింది. తాజాగా దిశ పోలీస్ స్టేషన్‌ల పేర్లను మహిళా పోలీస్ స్టేషన్‌లుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మార్చడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వంకు పేర్లు మార్చడం పై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని విమర్శించింది.