విదేశీ పర్యటన మీకు ఇష్టమా..తక్కువ ఖర్చుతో అందమైన ఈ దేశాలను చుట్టేయ్యండి..

www.mannamweb.com


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడం ఉద్దేశ్యం పర్యాటకం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే.

దీనితో పాటు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సహకారంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ ప్రత్యేక సందర్భంలో ఫ్రెండ్లీ బడ్జెట్‌లో ప్రయాణించగల దేశాల గురించి తెలుసుకుందాం.. భారతీయులు ఈ దేశాలను ఎక్కువగా సందర్శిస్తారు.

తక్కువ ధరలో సందర్శించే సరసమైన దేశాల జాబితాలో కంబోడియా పేరు కూడా చేర్చబడింది. ఈ దేశంలో 1 భారత రూపాయి విలువ 50 కంబోడియన్ రీలు. ఈ కంబోడియాలోని పురాతన దేవాలయాలను చూడవచ్చు. ఇక్కడ మ్యూజియంలు, రాజభవనాలు, చైనా పూర్వపు శిధిలాలు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కనుల విందు చేస్తాయి.

భారతదేశానికి సమీప దేశం నేపాల్. వీసా లేకుండా కూడా ఈ దేశంలో పర్యటించవచ్చు. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు చూడదగినవి. ముఖ్యంగా కేదార్నాథ్ ఆలయ సందర్శనం నేపాల్ లోని పశుపతి నాథుడి ఆలయ సందర్శంతోనే పూర్తి అవుతుందని హిందువుల నమ్మకం. దీంతో ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నేపాల్ సందర్శిస్తారు. ఇక్కడ 1 భారత రూపాయి విలువ 1.60 నేపాలీ రూపాయికి సమానం.

మీ బడ్జెట్‌లో విదేశంలో ప్రయాణించాలనుకుంటే.. శ్రీలంకను కూడా ఆ జాబితాలో చేర్చుకోవచ్చు. దక్షిణాసియాలోని హిందూ మహాసముద్రం ఉత్తర భాగంలో ఉన్న ఒక ద్వీపం శ్రీలంక. ఇది చాలా అందమైన దేశం. ఇక్కడికి చాలా సులభంగా చేరుకోవచ్చు. శ్రీలంకలో 1 భారత రూపాయి విలువ 3.75 శ్రీలంక రూపాయలు.

ఇండోనేషియా చాలా అందమైన దేశం. బీచ్ ప్రేమికులు ఇక్కడ విహరించేందుకు ఎక్కువగా వెళ్తుంటారు. విశేషమేమిటంటే ఇక్కడ మీరు బడ్జెట్‌లో ప్రయాణించవచ్చు. ఇక్కడ 1 భారత రూపాయి విలువ ఇండోనేషియా రూపాయి సుమారు 180లకి సమానం. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరినా సరే పూర్తిగా రిఫ్రెష్‌ అవుతారు.