డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

www.mannamweb.com


తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేస్తోంది. లడ్డూలో వాడిన నెయ్యి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ కావడంతో కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హిందూ మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో.. సనాతన ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై కొందరు విమర్శలకు దిగిన నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని, పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అని ఎద్దేవా చేశారు. ‘‘డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట.. అన్నీ మతాలను అందరూ గౌరవించాలి’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.