దొరికింది దొరికినట్టు పిండేస్తోన్న నెంబర్ 1 అవినీతి ఎమ్మెల్యే

www.mannamweb.com


గెలిచిన వారం రోజుల నుంచే వసూళ్ల దందా- తీరంలో రిసార్ట్ యాజమాన్యాల నుంచి వసూళ్లు
– మద్యం దుకాణాలు.. టౌన్లో వ్యాపారులు కప్పం కట్టాల్సిందే
– విలేకర్లకు బెదిరింపులు..
కేసులు కూడా… ?

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు దాటిందో లేదో చాలా మంది ఎమ్మెల్యేలు వసూళ్ల దందా.. మాకు చందా అంటూ మొదలు పెట్టేశారు. దక్షిణ కోస్తాలోని ఓ ప్రముఖ జిల్లాలో ఓ టీడీపీఎమ్మెల్యే కూడా వసూళ్ల పర్వానికి తెరలేపారు. అప్పుడెప్పుడో జమానా కాలంలో ఓ సారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సదరు ఎమ్మెల్యే చాలా యేళ్ల తర్వాత లక్‌గా ఎమ్మెల్యే సీటు దక్కించుకుని గాలిలో … ముక్కోణంలో ఎమ్మెల్యే అయ్యారు.

గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే నియోజకవర్గంలో రెస్టారెంట్లు.. సముద్ర తీరంలో రిసార్ట్‌లు.. మద్యం దుకాణాదారులు… నియోజకవర్గ కేంద్రమైన టౌన్‌లో రకరకాల వ్యాపారులకు ఎమ్మెల్యేకు కప్పం కట్టాలన్న ఆదేశాలు వెళ్లిపోయాయి. దీంతో నియోజకవర్గంలో రిసార్ట్ యజమానులు.. వ్యాపారులు అయితే ఇదేం కర్మరా బాబు అని వారం రోజులకే బెంబేలెత్తిపోయారు. ఎమ్మెల్యే అనుచరులు అయితే సముద్ర తీరంలో రకరకాల వ్యాపారాలు చేసే వారిని బెదిరించి కప్పం వసూలు చేయడమో లేదా .. ఆ వ్యాపారాలను తమ చేతుల్లోకి తీసుకోవడమో చేస్తున్నారు.

ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోందన్న టాక్ కూడా ఉంది. ఇక ఎవరికి అయినా ఇసుక కావాలంటే.. కనీసం సామాన్య పౌరులు ఇళ్లు కట్టుకోవడం కూడా ట్రక్కు ఇసుక కావాలన్నా ఎమ్మెల్యే.. ఆయన అనుచరుల కనుసన్నల్లో వెళ్లాలి.. వాళ్ల వాటాలు వాళ్లకు వెళ్లాలి. సదరు ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పటికే నియోజకవర్గం మొత్తం పాకేసింది. దీంతో ప్రభుత్వ అధికారులతో మొదలు పెట్టి వ్యాపారులు.. సాధారణ ప్రజలు కూడా ఈ ఐదేళ్లు ఎలా ? భరించాలిరా బాబు అని బెంబేలెత్తుతున్నారు. ప్రజల్లో పట్టున్న ప్రముఖ యుట్యూబ్ ఛానెల్ జర్నలిస్టు ఈయనను జాగ్రత్త పడాలని ఓ స్టోరీ చేస్తే ఆయనపై కూడా తన అనుచరులతో కేసులు పెట్టించారు.

ఇక సదరు ఎమ్మెల్యేకే చెందిన ఓ విద్యాసంస్థ విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కళాశాలలో ఫీజులు కట్టలేదని ఆ విద్యాసంస్థలో చదువుతోన్న విద్యార్థులకు భోజనం కూడా పెట్టకుండా వేధిస్తున్నారట. మంత్రి లోకేష్ పీఏ మాట్లాడి ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా సర్దుబాటు చేస్తాం.. విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పినా కూడా హింసిస్తున్నారట. ఏదేమైనా ఈ ఎమ్మెల్యే చేష్టలు.. అవినీతి విషయం ఇప్పుడు కూటమి ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.