బాధ్యతగా మాట్లాడాలి.. కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించిన చిరంజీవి, బన్నీ, వెంకటేష్

www.mannamweb.com


నాగచైతన్య-సమంత కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని నిన్న కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.

వాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దని అంటున్నారు. సినీ వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం పై సీరియస్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. ఆ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్లు తెలిపారు. వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాగడం.. అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు.

అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ.. కొండా సురేఖ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు అని బన్నీ అన్నారు. అలాగే ‘ సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంత సులభంగా వదలకూడదు. మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, ప్రత్యేకించి మహిళల పట్ల గౌరవంగా ఉండాలనినేను కోరుతున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.

వెంకటేష్ స్పందిస్తూ.. ‘ వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. మా కుటుంబం పరస్పర గౌరవం, కృషి , మా క్రాఫ్ట్, మా వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో ఉంటాం. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవడం పై పబ్లిక్ ఫిగర్లకు నైతిక బాధ్యత ఉండాలి. వ్యక్తిగత జీవితాలను రాజకీయలోకి లాగడం ఎవరికీ ఉపయోగపడదు. ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు గౌరవంగా ప్రవర్తించాలని నేను కోరుతున్నాను. మన చర్యలు , మాటలు బరువును కలిగి ఉంటాయని గుర్తు చేద్దాం అని వెంకటేష్ అన్నారు.