టీటీడీ లడ్డూ వివాదం… ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి…

www.mannamweb.com


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పాలనలో టీటీడీకి (TTDP) సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గురువారం మీడియాతో … ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి (AR Foods Company) నెలకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని టీటీడీ టెక్నికల్ టీమ్ నవంబర్ 8, 2023న తేల్చిందన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెలకు ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం రూ.16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని తెలిపారు. ఇలాంటి కంపెనీ నెలకు వెయ్యి టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏఆర్‌ ఫుడ్స్‌పై ప్రశ్నలు..

ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెయ్యి స్టోరేజి ట్యాంకు కెపాసిటీ కేవలం 6 టన్నులని వెల్లడించారు. 6 టన్నుల నెయ్యితో 16 టన్నుల కెపాసిటీ గల లారీలను ఏఆర్ ఫుడ్స్ ఎలా నింపగలదని ప్రశ్నించారు. ఏఆర్ ఫుడ్స్ నుంచి నెయ్యితో బయలుదేరిన లారీలు 500 కిలోమీటర్ల దూరాన్ని వారం నుంచి 9 రోజులు ప్రయాణం చేయడం ఏంటని నిలదీశారు. ఏఆర్ ఫుడ్స్‌కు అంత నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేక నెయ్యి కల్తీ చేసి, సరఫరా చేసేందుకే ఇన్ని రోజుల సమయం పట్టిందని ఆరోపించారు. శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డెయిరీని అడ్డుపెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని మండిపడ్డారు.

అందుకే సిట్..

టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టులను కూడా ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో జగన్ పోస్టు చేయాలన్నారు. సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్.. తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా అని ప్రశ్నించారు. రూ.39 కోట్ల నెయ్యి కాంట్రాక్టులో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్లకు సపోర్ట్ చేసే అధికారులు పాపాలు చేశారని విమర్శించారు. వైసీపీ చేసిన పాపాలను నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిట్ వేసిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో త్వరలోనే నెయ్యి కల్తీకి పాల్పడిన దుర్మార్గులను ప్రజల ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

భక్తులకు పక్కదారి పట్టించేలా.

జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, శ్రీవారి ప్రసాదాల్లో ఎవరెవరు ఎంత దోచుకున్నారో అన్నీ త్వరలోనే కక్కిస్తానని అన్నారు. ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ పరికరాలు లేవు గనుకనే ఎన్డీడీబీకి నెయ్యిని టెస్టింగ్‌కు పంపాల్సి వచ్చిందని టీటీడీ చెబుతోందన్నారు. వైసీపీ నేతలు తమ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను, శ్రీవారి భక్తులను ప్రక్కదారి పట్టించేలా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్వచ్ఛమైన నందిని నెయ్యితోనే శ్రీవారి ప్రసాదాలు తయారు చేపిస్తున్నామని.. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.