చల్లటి వార్త.. మళ్లీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. కోస్తాంధ్రకు విస్తారంగా వానలే వానలు

www.mannamweb.com


ఏపీలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అటు ఏపీలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కర్నూలు జిల్లా ఆలూరులో కల్లే వాగు వంతెనపైకి వరదనీరు చేరింది. గుంతకల్లు-ఆదోని మధ్య అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గురువారం కడప జిల్లా తుమ్మలూరులో పిడుగు పాటుకు ముగ్గురు మృతిచెందారు.

మరోవైపు తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.