ఏపీలో వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ మొత్తం కట్, ఉత్తర్వులు జారీ

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమంటూ కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ప్రకటించారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ ఈ అదనపు అలవెన్సులు రద్దు చేసింది.. తాజాగా‌ గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటూ ఆదేశాలిచ్చారు.

గత ప్రభుత్వం ప్రతినెలా రూ.200 చొప్పున దిన పత్రిక కొనుగోలుకు చెల్లించాలని నిర్ణయించింది. 2022 జూన్‌ 29న జీవో (ఆర్టీ నంబరు 12) జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం ఓ దినపత్రిక సర్క్యులేషన్‌ పెంచుకోవడంతో పాటు ఆ సంస్థకు ప్రతి నెలా కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అలవెన్సుల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు. అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు సాయం ఆపేయాలని ప్రతిపాదనల్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అక్టోబరు నెల పింఛన్లు తొలి రోజు రికార్డు స్థాయిలో పంపిణీ జరిగింది. తొలి రోజు మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 97.65 శాతం మేర పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64.38 లక్షల మందికి రూ.2,721 కోట్లు అందించాల్సి ఉండగా.. నిర్దేశిత సమయానికి 62.90 లక్షల మందికి రూ.2,656 కోట్ల మేర పంపిణీ చేశారు. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను అందించారు. అయితే మంగళవారం పింఛను అందుకోలేని మిగతా వారికి బుధవారం పంపిణీ చేయనున్నారు.