డీఎస్సీ అభ్యర్ధులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్‌.. మళ్లీ ప్రారంభమైన డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌

www.mannamweb.com


తెలంగాణ డీఎస్సీ 2024 ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంగళవారం (అక్టోబర్‌ 15) ఉదయం ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే.

సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యాశాఖ మరో కీలక ప్రకటన చేసింది.

ఉదయం తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారమైందని, డీఎస్సీ కౌన్సెలింగ్‌ను మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించినట్లు ప్రకటనలో వివరించింది. దీంతో ఈ రోజు ఉదయం కౌన్సెలింగ్‌కు వచ్చి వెనుదిరిగిన అభ్యర్ధులకు ఆయా జిల్లాల డీఈవోలు కౌన్సెలింగ్‌కు రావాలని మళ్లీ సమాచారం అందించారు.

డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు ఈ రోజు పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావల్సి ఉంది. అయితే.. సాకేంతిక సమస్యలతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ఉదయం విద్యా శాఖ ప్రకటించింది. ఇంతలో సమస్య పరిష్కారం కావడంతో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచే కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు మళ్లీ ప్రకటించారు. దీంతో వెనుదిరిగిన అభ్యర్ధులందరికీ ఫోన్ల ద్వారా సమాచారం అందించి కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు చెబుతున్నారు.