చంద్రబాబు సర్కార్ మరో ముందడుగు.. 3 ఉచిత సిలిండర్ల పథకంపై కేబినెట్ చర్చ

www.mannamweb.com


అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు మరికొన్ని అంశాలపై సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. దీనిలో భాగంగా ఏపీ మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం బుధవారం భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది.

అలాగే రాష్ట్రంలోని దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల కంటే అధికంగా ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో 17 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుమలలో లడ్డూ కల్తీ ఘటన తర్వాత.. పాలకమండలిలో బ్రాహ్మణులుండాలన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలన్న ఆలోచనలో ఉంది. ఈ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇక అసెంబ్లీ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన 6నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై కేబినెట్ చర్చించనున్నారు. సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పాలసీలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించారు. మొత్తం 10 శాఖల్లో నూతన పాలసీలను సిద్ధం చేశారు. వాటిపైనా ఈ కేబినెట్‌ మీటింగ్‌తో ఓ క్లారిటీకి రానున్నారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన ఆరు పాలసీలపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఏపీ కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.