తమిళనాడులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. హత్య కేసులో నిందితుడు

www.mannamweb.com


మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తున్నారు. శ్రీకాంత్‌ని కారులో ఎక్కిస్తున్న సమయంలో మాట్లాడారు. తాను డాక్టర్‌నని.. ప్రాణాలు పోయడమే తప్ప ప్రాణాలు తీయడం చేతకాదంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ జిల్లా విషయంలో జరిగిన.. అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు ప్రశ్నించి ఈ నెల 18న రిమాండ్‌కు పంపారు.

ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడులో ఉన్నట్లు గుర్తించి మదురైలో అదుపులోకి తీసుకున్నారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌ ధర్మేశ్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

మరోవైపు తన కొడుకు శ్రీకాంత్ అరెస్టును మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రోద్బలంతోనే పోలీసులు తన కొడుకును అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ రాజకీయ జీవితాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే సుభాష్… తన కొడుకుని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఏ తప్పూ చేయని శ్రీకాంత్ నిర్దోషిగా బయటపడతాడన్న నమ్మకం తనకి ఉందన్నారు. అమలాపురంలో బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ గతంలో వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉండేవారు.

2022లో కోనసీమ అల్లర్ల సమయంలో అప్పటి మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి కేసులో సుభాష్‌పై కేసులు నమోదయ్యాయి. అనంతరం ఆయన వైసీపీకి దూరం జరిగిన మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తనపై గతంలో కేసులు పెట్టించానన్న కక్షతోనే వాసంశెట్టి సుభాష్ ఇప్పడు తన కుమారుడిని హత్యకేసులో ఇరికించారంటూ విశ్వరూప్ ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.