ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు షాకిచ్చిన కోర్టు.. కారణం ఏంటంటే

www.mannamweb.com


తిరుమల లడ్డూ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్డు పవన్‌కు సమన్లు జారీ చేసింది.

తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఆమెను కూడా వచ్చే నెలలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోర్టు తేల్చి చెప్పింది.

తిరుమల లడ్డూ విషయంలో పవన్‌ వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్‌ ఆరోపించారని పిటిషన్‌లో వెల్లడించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. అదే సమయంలో తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు సహా పలు అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది రామారావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్‌కు సమన్లు జారీ చేసింది