గడ్డం, మీసాలు పెంచొద్దు.. షూ అస్సలు వేసుకోవద్దు.. కాలేజీలో ర్యాగింగ్ కలకలం

www.mannamweb.com


కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కొత్తగా వచ్చిన MBBS ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ను సీనియర్స్‌ ర్యాగింగ్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికార యంత్రాగం సీరియస్‌ అవుతోంది.

ర్యాగింగ్‌ విషయంలో ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా ఏదో ప్రాంతంలో దాని జాడ వెలుగులోకి వస్తుండడం భయపెడుతోంది. తాజాగా.. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు పెద్దయెత్తున ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వారం రోజుల క్రితం కాలేజీలో చేరిన ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రెషర్స్ ఎవరూ గడ్డం పెంచరాదని.. మీసాలు పెంచరాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే.. హాస్టల్లో ప్లేట్లలో భోజనం పెట్టుకుని తీసుకురావాలని.. తిన్న ప్లేట్లను కడగాలని ర్యాగింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము చెప్పిన యాప్‌లలో మాత్రమే బుక్స్ కొనాలని, ఎవరూ షూ వేసుకుని రాకూడదని ఆదేశించినట్లు కూడా మెడికల్‌ కాలేజ్‌ పరిసరాల్లో టాక్‌ నడుస్తోంది.

ఈ క్రమంలోనే.. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక కొందరు ప్రెషర్స్ తల్లిదండ్రులు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ర్యాగింగ్ విషయం తన దృష్టికి రాలేదని.. ఆరోపణల నేపథ్యంలో స్పెషల్‌ ఫోకస్‌ పెడతామన్నారు. కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందా లేదా అనేదానిపై ఐదుగురితో నిజనిర్ధారణ కమిటీ వేసినట్లు తెలిపారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగినట్లు తేలితే కమిటీ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కాలేజ్‌ ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ.

ఇక.. మూడు రోజుల క్రితమే స్వయంగా కర్నూలు జిల్లా ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ.. పోలీసు ఉన్నతాధికారుల వార్నింగ్‌ తర్వాత కూడా కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్ వెలుగులోకి రావడంపై సీరియస్‌ అయ్యారు. ర్యాగింగ్ జరిగినట్లు ప్రచారం జరగడంతో పోలీసులు కాలేజీకి హాస్టల్‌కి వెళ్లి పరిశీలించినట్లు తెలుస్తోంది.