మరో కీలక పరిణామం.. సెయిల్‌లో విలీన ప్రతిపాదన ఉండగానే వీఆర్‌ఎస్‌పై సర్వే.

www.mannamweb.com


విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓవైపు కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెబుతుంటే.. మరోవైపు వీఆర్‌ఎస్‌పై సర్వే జరుగుతుండటం ఆందోళనకు కారణమవుతోంది.

సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రతిపాదన ఉండగానే .. తాజాగా ఉద్యోగుల వీఆర్ఎస్ పై యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయటం వివాదంగా మారింది. వీఆర్ఎస్‌ పేరుతో మరో పెద్దకుట్ర జరుగుతోందని కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. 2500 మందిని వీఆర్ఎస్‌ ద్వారా ఇంటికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇటు కార్మిక సంఘాలు సైతం వీఆర్ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. యాజమాన్యం వీఆర్ఎస్‌ స్కీమ్‌ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులందరూ వీఆర్ఎస్‌ స్కీమ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల పోరాట ఫలితంగా రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ తెరుస్తున్న సమయంలో ఈ చర్య ఉత్పత్తిని దెబ్బకొడుతుందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉత్పత్తి తగ్గించి ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

గత మూడేళ్ల నుంచి ఉత్పత్తి తగ్గించారని.. రెండేళ్లుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నష్టాలు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జరగాల్సిన రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదని, పైగా వి.ఆర్‌.ఎస్‌.తో బలవంతంగా కార్మికులను బయటకు నెట్టే ప్రయత్నం చేయడం దారణమైన చర్య అంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎస్ చర్యలను విరమింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు.