ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. ఆమె ఎవరో తెలుసా

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ (ఏపీపీఎస్సీ)ను ఎట్టకేలకు నియమించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ ఏపీపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 23) మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీరభ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఏపీపీఎస్పీ బాధ్యతల్ని గాడిన పెట్టాలని భావిస్తున్న ఏపీ సర్కార్‌ ఆ బాధ్యతల్ని సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించే అధికారుల కోసం జల్లెడ పట్టి ఎట్టకేలకు ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను నియమించింది. ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు పొందారు. ఆమె సర్వీస్‌లో డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో కూడా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలోఎస్పీగా, ఐజీగా పని చేశారు.

ఎవరీ సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ అనురాధ?

1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాండర్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త కూడా ఐపీఎస్ ఆఫీసరే. ఆయన ఎవరో కాదు నిమ్మగడ్డ సురేంద్రబాబు. ఈయన కూడా ఐపీఎస్ అధికారిగా పలు బాధ్యతలు నిర్వహించారు. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయం మేరకు సీనియర్‌ ఐపీఎస్‌ అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం దక్కించుకున్న కూటమి సర్కార్‌.. అధికారంలోకి రాగానే అప్పటి వరకూ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగుతున్న గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.

ఇక గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అప్పటి ప్రతిపక్ష నేతలు ఓ రేంజ్‌లో ఆరోపణలు చేశారు. ఇక గ్రూప్‌ 1 పరీక్షల మూల్యాంకనంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని, తమకుకావాల్సిన వారికి మాత్రమే ఒకటికి మూడు సార్లు మూల్యంకనం చేసి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్నప్పటికీ గౌతతమ్‌ సవాంగ్‌ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలగారు.