జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’. దీని రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణను పొంది రూ.కోట్లు వసూలు చేశాయి.
ఇప్పుడు దీని మూడో భాగం భారీ అంచనాల మధ్య తెరకెక్కనుంది. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ (avatar 3) పేరుతో రానున్న ఈ సినిమాపై జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత రెండు చిత్రాలతో పోలిస్తే దీని నిడివి కూడా రెట్టింపు ఉంటుందన్నారు.
”ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్ వండర్ను చూసిన తర్వాత ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారు. గతంలోని రెండు చిత్రాల్లో చూపిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకుంటున్నాం. వాటికి బదులుగా కొన్ని ధైర్యమైన ఎంపికలతో మీ ముందుకు వస్తాను. ఇలా ధైర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రతిఒక్కరి సమయాన్ని, డబ్బును వృథా చేసినవాడిని అవుతాను. రెండు భాగాల్లో లేని అద్భుతాలను అవతార్ మూడో పార్ట్లో చూస్తారు. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్ని ఇందులో చూస్తారు. మరో కొత్త ప్రపంచం భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం” అని చెప్పారు.
మమ్మల్ని వదిలేయండి: కరీనా కపూర్ విజ్ఞప్తి
ప్రపంచ చిత్ర పరిశ్రమలో ‘అవతార్’ ఓ సంచలనం. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచమిది. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో మంచి ట్రీట్ ఇచ్చారు. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్తో రూపొందించనున్నారు. 2025 డిసెంబరు 19న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
































