ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కొశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై విమర్శలు వెల్లివెత్తున్నాయి. పేపర్ లీక్పై ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదంటూ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే… గతంలో యూనివర్శిటీ తరపున ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్కు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేవారు. కానీ ఈ సారి మాత్రం ప్రశ్నాపత్రాలను కాలేజీలకు సీడీల్లో పంపించారు. అరగంట ముందు సీడీ పాస్ వార్డ్లు యాజమాన్యాలకు పంపిస్తున్నారు. దీంతో క్వశ్చన్ పేపర్ విషయంలో పోలీసుల పర్యవేక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక బీఎడ్ పేపర్ లీక్ ఘటనపై స్పందించారు మంత్రి నారా లోకేష్. పరీక్ష రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్లీక్ అంశంపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదే లేదన్న ఆయన… బాధ్యులపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు నారా లోకేష్.