Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 67,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించారు.
తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో తొమ్మిది కంపార్ట్మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
కాగా- టీటీడీ అధికారులు త్వరలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు సహా అన్ని రకాల టికెట్లు/టోకెన్ల జారీ, తిరుపతి, తిరుమలల్లో ఉండే వసతి భవన సముదాయాల్లో గదుల బుకింగ్లో ఈకేవైసీ, ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థ అమలులోకి రానుంది.
దీనికి కారణాలు లేకపోలేదు. టికెట్ల బుకింగ్లో దళారుల జోక్యాన్ని నివారించడానికి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈకేవైసీ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ను రెవెన్యూ (దేవాదాయం) శాఖ కార్యదర్శి వినయ్ చంద్ జారీ చేశారు.
ఆధార్ అథెంటికేషన్, ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలంటూ టీటీడీ కొత్త పాలక మండలి తన తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే- ఆధార్ అథెంటికేషన్కు అనుమతి ఇవ్వాలంటూ టీటీడీ కార్యనిర్వహణాధికారి.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.