ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తేల్చేసింది టీడీపీ. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ)కు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఎమ్మెల్సీ పోస్టుల కోసం చాలామంది ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేశారు.
ఏపీ టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ(ఎస్సీ), బీద రవిచంద్ర(బీసీ), BT నాయుడు(బీసీ)లకు అవకాశం కల్పించింది. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించారు. ఇప్పటికే ఒక స్థానం జనసేనకు కేటాయించగా.. ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు.
కాగా టీడీపీలో చాలామంది నేతలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, దువ్వారపు రామారావు, మాజీ మంత్రి జవహర్, కొమ్మాలపాటి శ్రీధర్, అశోక్బాబు, టీడీ జనార్ధన్ వంటి వారు గట్టి ప్రయత్నం చేశారు. 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని వారికి పార్టీ హైకమాండ్ ఫోన్ చేసినట్లు సమాచారం.
ఇక సోము వీర్రాజు పేరును బీజేపీలోని కొందరు పెద్దలు ఎమ్మెల్సీ స్థానానికి ప్రతిపాదిస్తోన్నట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన పీసీఎన్ మాధవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.