ఓటీటీలోకి క‌న్న‌డ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

క‌న్న‌డ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ క‌ప్పు బిలుపిన న‌డువే సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రెంట‌ల్ విధానంలో రిలీజ్ చేశారు. థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ ఇర‌వై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.


ఐఎమ్‌డీబీలో…

క‌ప్పు బిలుపిన న‌డువే సినిమాలో వ‌సంత్ విష్ణు హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విద్యా శ్రీ గౌడ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో క‌న్న‌డ సీనియ‌ర్ యాక్ట‌ర్ శ‌ర‌త్ లోహితస్వ కీల‌క పాత్ర పోషించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల నుంచి స్ఫూర్తితో క‌ప్పు బిలుపిన న‌డువే సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించాడు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

క‌ప్పు బిలుపిన న‌డువే క‌థ ఇదే…

విష్ణు, న‌వ్య సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్లు. మ‌రికొంద‌రు స్నేహితుల‌తో క‌లిసి ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వ‌హిస్తుంటారు. దేవ‌గిరి అనే ఊళ్లో ద‌య్యాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటుంది. ఆ మిస్ట‌రీని ఛేదించేందుకు దేవ‌గిరి ఊళ్లో ఉన్న పాడుబ‌డిన ఫ్యాక్ట‌రీలోకి అడుగుపెడ‌తారు. వారికి అదే ఊరికి చెందిన సంజ‌య్ గైడ్‌గా ఉండ‌టానికి అంగీక‌రిస్తాడు. ఆ ఫ్యాక్ట‌రీలో విష్ణు, న‌వ్య‌ల‌కు ఎ లాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? చ‌నిపోయిన సంజ‌య్ వాళ్ల‌కు ఎలా క‌నిపించాడు? అస‌లు ఆ ఊళ్లో నిజంగానే ద‌య్యాలు ఉన్నాయా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

హార‌ర్ ట్విస్ట్‌లు…

సోష‌ల్ మీడియా మోజులో ప‌డి కొంద‌రు యువ‌త త‌మ ప్రాణాల‌ను ఎలా కోల్పోతున్నార‌నే సందేశాన్ని క‌ప్పు బిలుపిన న‌డువే ద్వారా డైరెక్ట‌ర్ ఇచ్చాడు. హార‌ర్ ఎలిమెంట్స్‌, ట్విస్ట్‌ల‌తో పాటు వ‌సంత్ విష్ణు యాక్టింగ్ బాగుందనే పేరొచ్చింది. థియేట‌ర్ల‌లో మాత్రం మోస్తారు వ‌సూళ్ల‌నే ఈ మూవీ రాబ‌ట్టింది.

తెలుగులో హిట్ సినిమాలు…

క‌ప్పు బిలుపిన న‌డువే మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన శ‌ర‌త్ లోహితస్వ. తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేశాడు. జై ల‌వ కుశ‌, అఖండ‌, అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌తో సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించాడు. సాహో, స్కంద‌, ఉగ్రం సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు.