రాష్ట్రంలోని పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రతి నెలా మొదటి రోజే ఇళ్లవద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ జరుగుతోంది.
ప్రతి నెలా ఒకటో తేదీ పింఛన్లు అందిస్తుండగా.. ఆ రోజు సెలవు అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే పింఛన్ల పంపిణీ సమయంలో ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతోంది. టెక్నికల్ సమస్య కారణంగా పింఛన్ల పంపిణీ అక్కడక్కడా ఆలస్యమవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సర్వర్ సమస్య ఒకటి అయితే.. పింఛన్ తీసుకునే వారి వేలిముద్రలు పడకపోవటం మరో సమస్య. అయితే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రంలోని లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లబ్దిదారులు తమ వేలిముద్రలను స్కాన్ చేసిన తర్వాత సచివాలయ సిబ్బంది వారికి పింఛన్ మొత్తాన్ని అందిస్తారు. అయితే వృద్ధాప్యం కారణంగా కొంతమంది వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోవటంతో సమస్య వస్తోంది. వీరి వేలిముద్రలు స్కానర్లపై పడకపోవటంతో పింఛన్ల పంపిణీలో ఇబ్బంది కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయాలకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపుతోంది. పింఛన్ల పంపిణీ సమయంలో వీటిని ఉపయోగించనున్నారు. మొత్తం 1,34,450 స్కానర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. సచివాలయాల వారీగా వీటిని పంపిణీ చేయనున్నారు. ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన నూతన పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే అవ్వాతాతలకు కూడా ప్రయోజనం కలగనుంది. మరోవైపు ఎన్టీఅర్ భరోసా పింఛన్ల పంపిణీని తెల్లవారుజామునే కాకుండా ఏడు గంటల నుంచి అందిస్తు్న్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వేలిముద్రల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉండటంతో పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.