కొత్త టెక్నాలజీ.. విమానం కూలిపోయినా అందరూ సేఫ్

హ్మదాబాద్‌లో ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశంలో తీవ్ర విషాదాన్నే నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణమైన నిమిషం లోపే విమానం కూలిపోవడంతో ప్లేన్లో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా దుర్మరణం పాలయ్యారు.


ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా మిరాకిల్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోర విమాన ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ప్రతి సందర్భంలోనూ విమానాల్లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోవడమే జరుగుతుంటుంది.

ఐతే ఇలా ప్లేన్స్ కూలినపుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి అవకాశమే లేదా? ఆ రకమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం అసాధ్యమా అనే ప్రశ్నలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అందుకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది ఉక్రెయిన్. విమానాలు కూలినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడేలా ఆ దేశం ఒక సాంకేతికను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ నడుస్తున్నాయట. విమానంలో ప్రయాణికులు ఉన్న కంటైనర్.. ప్రమాదాల సమయంలో విడిపోయేలా, అది సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఉక్రెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు.

విమానం కూలిపోయే సంకేతాలు కనిపించగానే ఒక బటన్ నొక్కితే ప్రయాణికులు ఉన్న కంటైనర్ ఇంజిన్ నుంచి వేరైపోతుంది. ఈ కంటైనర్ పైన ఉన్న భారీ ప్యారాచ్యూట్లు ఓపెన్ అవుతాయి. అవి సేఫ్‌గా కంటైనర్‌ను ల్యాండ్ చేస్తాయి. భూమి మీద అయినా, నీళ్ల మీద అయినా.. ఏ ఇబ్బంది లేకుండా కంటైనర్ ల్యాండ్ అయ్యేలా కింద కుషన్స్ యాక్టివేట్ అయి సర్దుకుంటాయి. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారు. దీనికి సంబంధించిన యానిమేటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. నిజంగా ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే విమానయానంలో అదొక విప్లవాత్మక మార్పుగా మారడం ఖాయం. కాకపోతే దీనికి భారీగానే ఖర్చవుతుంది. ఇలాంటి విమానాల్లో ప్రయాణాలు కూడా ఖరీదుగా మారొచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.