ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ కింద ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.
ప్రస్తుత విద్యా సంవత్సంకు కూడా ఈ పథకం అమలుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఈ స్కాలర్షిప్కు దరఖాస్తులు సమర్పించేందుకు అర్హతలు ఏమిటి?, దరఖాస్తు ఎలా సమర్పించాలి?, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది?… అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్ ఔట్ కాకుండా నివారించి, వారిని చదువుకునేందుకు ప్రోత్సహించే ఉద్దేశంతో నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షి తీసుకొస్తుంది. వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏడాదికి రూ. 12 వేల ఈ స్కాలర్షిప్ అందించనున్నారు. ఈ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. అయితే వీరు 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలాగే వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్కు అర్హులు కాదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంది.
అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. https://scholarships.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి… కొత్త యూజర్స్ అయితే ఓటీఆర్ ప్రక్రియను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్థులు ”ఫ్రెష్ స్కాలర్షిప్” విభాగంలో NMMSS 2025-26 దరఖాస్తు ఫామ్పై క్లిక్ చేయాలి. అడిగిన వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి. మార్క్ షీట్లు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), ఆధార్ కార్డ్తో సహా అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి.
లబ్ధిదారులను షార్ట్లిస్ట్ చేయడం, ఎంపిక చేయడం మెరిట్పై ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర విద్యా శాఖలు ఎంహెచ్ఆర్డీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తాయి. విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT), స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) లలో కనీసం 40 శాతం కలిపి మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు 32 శాతం. రాత పరీక్షల్లో ప్రతిభకనబరచిన విద్యార్థులను ఎంపిక చేసి… వారికి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కాలర్షిప్ అందజేస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తారు.
































