ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ”సుపరిపాలన తొలి అడుగు” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఏడాది కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. అలాగే పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలు గురించి చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పామని… ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు రూ. 20 వేల చొప్పున వేట నిషేధ భృతిని అందజేశామని తెలిపారు. 90 శాతం సబ్సిడీతో రైతులకు డ్రిప్ ఇస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసేందుకు సంకల్పం తీసుకున్నామని తెలిపారు. చేనేతలకు మరమగ్గం ఉంటే 500 యూనిట్లు, మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. విజన్ 2047లో భాగంగా పది సూత్రాలను రూపొందించుకున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా… అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించేలా విజన్ రూపొందించుకున్నామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో అందరికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించనున్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. అదే విధంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందేస్తామని వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ”ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆగస్టు 15న ప్రారంభిస్తాం… ఆ రోజే ఆటో డ్రైవర్లకు కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాం. ఒక పక్కన ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే… ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం” అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
































