రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత తీర్చేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది.
కేంద్రం నుంచి అదనపు కేటాయింపులు కోరడంతో పాటు రాష్ట్రంలో గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన 14 మంది నాన్ కేడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా తీసుకురానుంది.డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ,కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగానికి(డీవోపీటీ)కి ఈ విషయంపై విన్నవించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 240 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 140 మందిని కేటాయిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుతం జాబితాలో 125 మందిని చూపిస్తున్నా కేంద్ర సర్వీసులకు వెళ్లేవారు, దీర్ఘకాలిక సెలవులు తదితర కారణాల వల్ల గత పదేళ్లుగా ఆ సంఖ్య 110కి దాటడం లేదు.ఫలితంగా రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత ఎక్కువగా ఉంది. జిల్లాల సంఖ్య, రాష్ట్ర జనాభా పెరగడంతో ఇటీవల రాష్ట్రానికి ఐపీఎస్ల సంఖ్యను 172కు పెంచుతూ గెజిట్ విడుదలైంది.
అందులో యూపీఎస్సీ ద్వారా ఎంపికైన రెగ్యులర్ రిక్రూట్ ఐపీఎస్ అధికారులు 66.6 శాతం, రాష్ట్ర సర్వీసు (గ్రూప్ వన్) ద్వారా అధికారులు 33.3 శాతం నిష్పత్తితో ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో 60 శాతం లోపు రెగ్యులర్ రిక్రూట్ వాళ్లు, 40 శాతానికి పైగా ఎస్పీఎస్ నుంచి ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో మరో 14 మందికి ఐపీఎస్ హోదా రానుండటంతో ఈ శాతం సమానం అవుతుంది. దీన్ని యూపీఎస్సీ నుంచి ఎంపికైన రెగ్యులర్ ఐపీఎస్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. ఏటా రాష్ట్రానికి నలుగురు, ఐదుగురిని మించి కేంద్రం కేటాయించట్లేదని, ఒకేసారి రెగ్యులర్ రిక్రూట్ అధికారుల సంఖ్యను భారీగా పెంచుకోవడం కష్టమని డీజీపీ చెప్పినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి ప్రతి ఏటా 10 నుంచి 15 మంది చొప్పున కేటాయించి ఏపీలో ఐపీఎస్ల సంఖ్య 172 మేరకు ఉండేలా చూడాలని కోరనున్నట్లు తెలిసింది. రెగ్యులర్ రిక్రూట్ ఐపీఎస్లు 66.6 శాతం ఉండేలా సహకరించాలని డీవోపీటీకి డీజీపీ విన్నవించనున్నట్లు సమాచారం.






























